బుమ్రాలో వాళ్లిద్దరినీ చూస్తున్నా... అత‌ని వల్లే భారత్‌కు ప్రపంచకప్: పాక్ దిగ్గజం జహీర్ అబ్బాస్

  • సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రాలపై పాక్ దిగ్గజం జహీర్ అబ్బాస్ ప్రశంసలు
  • బుమ్రాను పాక్ బౌలింగ్ దిగ్గజాలు వకార్, వసీంలతో పోల్చిన వైనం
  • సంజూ మూడు మ్యాచుల్లో మూడు 80 ప్ల‌స్‌ స్కోర్లు చేయడం అసాధారణమన్న అబ్బాస్
  • బుమ్రా తన బౌలింగ్‌తోనే భారత్‌కు ప్రపంచకప్ అందించాడని వ్యాఖ్య
  • టీమిండియా ఛాంపియన్‌లా ఆడిందని కితాబు
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం జహీర్ అబ్బాస్ భారత క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా బ్యాటర్ సంజూ శాంసన్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. టీమిండియా ప్రపంచకప్ గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ, వారు ఛాంపియన్‌లా ఆడారని అభినందించాడు.

స్పోర్ట్స్ నౌ‌తో మాట్లాడుతూ జహీర్ అబ్బాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సంజూ శాంసన్ టాప్ ఆర్డర్‌లో అద్భుతంగా ఆడాడు. మూడు మ్యాచ్‌లలో మూడు సార్లు 80కి పైగా పరుగులు చేయడం అసాధారణమైన విషయం. ఇక, జస్ప్రీత్ బుమ్రా గురించి ఏం చెప్పాలి? అతను అసాధారణమైన ప్రతిభావంతుడు. జట్టు మొత్తం ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది" అని తెలిపాడు.

బుమ్రాను పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజాలతో పోలుస్తూ, "బుమ్రా.. వకార్ యూనిస్, వసీం అక్రమ్‌ల కలయిక. భారత్ అందించిన అత్యుత్తమ బౌలర్లలో అతనొకడనడంలో సందేహం లేదు. అతని యార్కర్లు, పేస్, కీలక సమయాల్లో బంతిని స్వింగ్ చేసే సామర్థ్యం అమోఘం. ఈ ప్రదర్శనతో అతను ఒంటిచేత్తో తన జట్టుకు ప్రపంచకప్ గెలిపించాడు" అని జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డాడు.

"భారత్ ఛాంపియన్‌లా ఆడింది. వారు ఈ టోర్నమెంట్‌ గెలవాల్సిందే. వారు మూడుసార్లు ఈ ఘనత సాధించారు. వారికి నా అభినందనలు. ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు" అని 78 ఏళ్ల అబ్బాస్ పేర్కొన్నాడు. 1969 నుంచి 1985 వరకు పాకిస్థాన్ తరఫున ఆడిన జహీర్ అబ్బాస్, 78 టెస్టులు, 62 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.




More Telugu News