జీతం ఇవ్వలేదని గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. యూపీలో ఘటన

  • ట్రక్కు యజమాని వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ల నిర్వాకం
  • సిలిండర్లను ఓ ఏజెన్సీ యజమానికి అమ్మిన వైనం
  • ఏజెన్సీ యజమాని సహా ఏడుగురు నిందితుల అరెస్ట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో ఇటీవల జరిగిన గ్యాస్ సిలిండర్ల ట్రక్కు అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ భారీ చోరీకి పాల్పడిన ఏడుగురు నిందితులను సిప్రి బజార్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. నిందితుల నుంచి చోరీకి గురైన మొత్తం 524 ఎల్‌పీజీ సిలిండర్లతో పాటు రూ.11.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో ఈ చోరీ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన జావేద్, రితిక్ గతంలో అదే ట్రక్కు యజమాని వద్ద డ్రైవర్లుగా పనిచేశారు. తమకు రావాల్సిన సుమారు 70 వేల రూపాయల జీతం బకాయిలను యజమాని ఇవ్వకపోవడంతో అతడిపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ దొంగతనానికి ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు. మార్చి 2 నుంచి 6వ తేదీ మధ్యలో గ్యాస్ ప్లాంట్ బయట ఉన్న ట్రక్కును వీరు అపహరించారు.


చోరీ చేసిన సిలిండర్లను నిందితులు ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమతార్‌లోని ‘శివ గ్యాస్ ఏజెన్సీ’ యజమానికి రూ. 13 లక్షలకు విక్రయించారు. ఈ లావాదేవీలో భాగస్వాములైన ఏజెన్సీ యజమానిని, మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 379 నిండుగా ఉన్న సిలిండర్లు, 135 ఖాళీ సిలిండర్లు ఉన్నాయి. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందానికి ఎస్ఎస్పీ 25 వేల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.


More Telugu News