CV Anand: తెలంగాణ డీజీపీ రేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు.. ముందు వరుసలో సీవీ ఆనంద్
- ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్న డీజీపీ శివధర్ రెడ్డి
- ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్ను ఖరారు చేసిన యూపీఎస్సీ ఉన్నత స్థాయి కమిటీ
- జాబితాలో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా
తెలంగాణ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ (డీజీపీ) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఢిల్లీలో జరిగిన యూపీఎస్సీ ఉన్నత స్థాయి కమిటీ భేటీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానల్ను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.
యూపీఎస్సీ సిఫార్సు చేసిన ముగ్గురు అధికారులు:
సీవీ ఆనంద్ (1992 బ్యాచ్): ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న ఆయన, సీనియారిటీలో అందరికంటే ముందున్నారు. మే 2028 వరకు ఆయనకు సర్వీస్ కాలం ఉంది.
వినాయక్ ప్రభాకర్ ఆప్టే (1994 బ్యాచ్): ప్రస్తుతం సెంట్రల్ డిప్యుటేషన్లో ఐబీ జాయింట్ డైరెక్టర్గా విధుల్లో ఉన్నారు.
డాక్టర్ సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్): ప్రస్తుతం హోమ్ గార్డ్స్ అండ్ ట్రైనింగ్ విభాగంలో డీజీగా సేవలు అందిస్తున్నారు.
సీనియారిటీ, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం పరంగా సీవీ ఆనంద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వినాయక్ ప్రభాకర్ ఆప్టే ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆనంద్కే డీజీపీ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే సౌమ్య మిశ్రా పేరు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తూ మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.