అత్యవసర చమురు నిల్వల విడుదల.. స్వాగతించిన భారత్

  • ప్రపంచ ఇంధన మార్కెట్ పరిస్థితులను గమనిస్తున్నామన్న అధికారి
  • ఐఈఏ ప్రయత్నాలకు మద్దతుగా అవసరమైన చర్యలకు భారత్ సిద్ధమని వెల్లడి
  • ఐఈఏ ఏర్పడిన తర్వాత చమురు నిల్వలు విడుదల చేయడం ఆరవసారి
ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయాలన్న ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) నిర్ణయాన్ని భారతదేశం స్వాగతించింది. ప్రపంచ ఇంధన మార్కెట్ పరిస్థితులను, మధ్యప్రాచ్యంలో మారుతున్న ఉద్రిక్త పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

ఐఈఏ ప్రయత్నాలకు అనుగుణంగా, ప్రపంచ మార్కెట్ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆ అధికారి తెలిపారు. ఐఈఏలో భారత్ అసోసియేట్ మెంబర్ మరియు ఇంటర్నేషనల్ ఎనర్జీ కోఆపరేషన్‌లో చురుకైన భాగస్వామి.

పశ్చిమాసియాలో కొనసాతున్న యుద్ధం కారణంగా, చమురు సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి, ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించడానికి సభ్య దేశాల అత్యవసర నిల్వల నుండి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి తీసుకురావడానికి ఐఈఏ సభ్యులు అంగీకరించారు. ఐఈఏ సభ్య దేశాలు 1.2 బిలియన్ బ్యారెళ్లకు పైగా అత్యవసర నిల్వలను కలిగి ఉన్నాయి.

1974లో ఐఈఏ ఆవిర్భవించింది. నాటి నుంచి చమురు నిల్వలు విడుదల చేయడం ఇది ఆరవసారి. అంతకుముందు 1991, 2005, 2011, అలాగే 2022లో రెండుసార్లు అత్యవసర చమురు నిల్వలను విడుదల చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయాలని ఐఈఏ బుధవారం నిర్ణయించింది.


More Telugu News