కష్టకాలంలోనూ భారత్ పెద్ద మనసు... మైత్రీ పైప్‌లైన్ ద్వారా బంగ్లాదేశ్‌కు డీజిల్ సరఫరా

  • మొత్తం 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్ పంపిణీ
  • మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాకు ఇంధన భద్రత కల్పించే చర్య
  • అసోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ నుంచి పంపింగ్ ప్రారంభం
  • సుమారు 44 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోనున్న డీజిల్
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు భారత్ మరోసారి అండగా నిలిచింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో ఇంధన నిల్వలను స్థిరంగా ఉంచేందుకు భారత్ సహాయం అందిస్తోంది. ఇరు దేశాల మధ్య నిర్మించిన 'బంగ్లాదేశ్-ఇండియా ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' ద్వారా సుమారు 5,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను సరఫరా చేస్తోంది. ఓవైపు భారత్ లోనూ పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలోనూ, కేంద్రం ఈ సుహృద్భావ సాయం చేస్తుండడం గమనార్హం.

బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 3:20 గంటలకు అసోంలోని నుమాలిగఢ్ రిఫైనరీ నుంచి ఈ డీజిల్ పంపింగ్ ప్రారంభమైంది. ఈ పైప్‌లైన్ ద్వారా పంపిన ఇంధనం సుమారు 44 గంటల్లో బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లాలో ఉన్న పర్బతీపూర్ డిపోకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల బంగ్లాదేశ్ ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసేందుకు ఈ సరఫరా ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ మైత్రీ పైప్‌లైన్ ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి.

Bangladesh India Friendship Pipeline
Bangladesh
India
diesel supply
energy crisis
BPC
Numaligarh Refinery
Parbatipur Depot
fuel supply
Maitree Pipeline

More Telugu News