వంటగ్యాస్ ఆందోళన... ప్రధాని మోదీ కీలక సమీక్ష

  • 10 శాతం మేర ఉత్పత్తి పెంచాలని ఇంధన ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు
  • భారత రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్న కేంద్రం
  • దేశానికి 70 శాతం ఉత్పత్తులు ఇతర మార్గాల్లో వస్తున్నాయన్న కేంద్రం
వంటగ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్‌ను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 10 శాతం మేర ఉత్పత్తిని పెంచాలని ఇంధన ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంధన ఉత్పత్తిపై ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై సమీక్ష జరిపారు.

కాగా ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమర్షియల్ ఎల్పీజీ వాస్తవ అవసరాలను గ్యాస్ కంపెనీలు అందుకోవాల్సిందేనని ఇంధన కంపెనీలకు స్పష్టం చేసింది.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కొంత సంక్షోభం వాస్తవమే కానీ పెట్రోలియం ఉత్పత్తుల ప్రస్తుతానికి ఇబ్బంది లేదని కేంద్రం తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధానికి ముందు తరహాలోనే భారత రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. దేశానికి వచ్చే 70 శాతం ఉత్పత్తులు హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర మార్గాల్లో వస్తున్నట్లు కేంద్రం తెలిపింది.


More Telugu News