మురిద్ ఎయిర్ బేస్ మరమ్మతు యత్నాలు పూర్తిగా విఫలం... కూల్చివేసిన పాకిస్థాన్

  • ఆపరేషన్ సిందూర్ సమయంలో దాడి చేసిన భారత్
  • దెబ్బతిన్న భవనాన్ని టార్పాలిన్ షీట్లతో కప్పి ఉంచిన పాక్
  • కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం
  • శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్న శిథిలాలు

గతేడాది భారత వైమానిక దళం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ధాటికి పాకిస్థాన్‌లోని కీలకమైన మురిద్ ఎయిర్‌బేస్ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నట్లు తాజా శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. చక్వాల్ సమీపంలోని ఈ వ్యూహాత్మక ఎయిర్‌బేస్‌లో ధ్వంసమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను పునరుద్ధరించడానికి పాక్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఫిబ్రవరి 28న అందిన చిత్రాల ప్రకారం, అక్కడ మరమ్మతులకు బదులుగా భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.


ప్రముఖ శాటిలైట్ ఇమేజరీ అనలిస్ట్ డామియన్ సైమన్ విశ్లేషణ ప్రకారం, ఈ భవనాన్ని ప్రస్తుతం పూర్తిగా నేలమట్టం చేశారు. కేవలం పైకప్పు మాత్రమే కాకుండా, భవనం లోపలి ప్రధాన నిర్మాణం (సుమారు 35x30 మీటర్లు) తీవ్రంగా దెబ్బతినడం వల్లే దీనిని రిపేర్ చేయడం అసాధ్యమని పాక్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఈ భవనాన్ని టార్పాలిన్ షీట్లతో కప్పి ఉంచినప్పటికీ, ఇప్పుడు అక్కడ కేవలం శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి.


2025 మే 10న తెల్లవారుజామున భారత వైమానిక దళం మెరుపు దాడి చేసిన 10 పాక్ ఎయిర్‌బేస్‌లలో మురిద్ ఒకటి. ఇక్కడి నుంచే డ్రోన్ల కార్యకలాపాలు సాగుతుంటాయని అంచనా. భారత గగనతలం నుంచే రఫేల్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించిన 'SCALP' వంటి శక్తివంతమైన ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణుల వల్లే పాక్ కు ఇంతటి భారీ అంతర్గత నష్టం సంభవించి ఉండవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.



More Telugu News