బీసీసీఐ, ఐసీసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు

  • తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అమరావతిని అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం
  • సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులతో పాటు క్రీడలు, పర్యాటక రంగాలపై ప్రత్యేక దృష్టి
  • పెట్టుబడుల కోసం వచ్చే సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచన
  • నీరుకొండలో భారీ టూరిజం ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశం
  • సచివాలయం, పలు సంస్థలకు భూ కేటాయింపులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం
తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటుతూ, భావితరాలకు ఒక గొప్ప వారసత్వ సంపదగా నిలిచేలా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో ఆదాయాన్ని సృష్టించే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి, ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. మొత్తం 167 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో వాటర్ ఫ్రంట్, కల్చరల్ సెంటర్, హోటళ్లు, అమ్యూజ్‌మెంట్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా దీనిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు.

భవిష్యత్తులో క్రీడా రంగం అతిపెద్ద ఆదాయ వనరుగా మారబోతోందని చంద్రబాబు విశ్లేషించారు. ఒకప్పుడు నిధుల కోసం ఎదురుచూసిన బీసీసీఐ, ఐసీసీ వంటి క్రికెట్ బోర్డులు ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎలా ఎదిగాయో గమనించాలని అన్నారు. ఇదే తరహాలో ఇతర క్రీడలు కూడా వాణిజ్యపరంగా మారే అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీ మాస్టర్ ప్లాన్ ఈ దిశగా ఉండాలని తెలిపారు.

రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలని చంద్రబాబు అన్నారు. "గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో సైబర్ సిటీలో పెట్టుబడులు పెట్టలేకపోయినందుకు డీఎల్ఎఫ్ వంటి సంస్థలు ఇప్పుడు బాధపడుతున్నాయి. అమరావతిలో ఆ అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నాయి. ఇది మన ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత. ఈ బ్రాండ్‌ను మరింతగా పెంచాలి" అని సూచించారు.

ఓవైపు రాజధానిలో పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రక్రియ కొనసాగాలని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించబోయే తెలుగు కల్చరల్ సెంటర్‌కు మంచి పేరును పరిశీలించాలని, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

సీఆర్డీఏ అథారిటీ ఆమోదాలు

ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కార్యాలయానికి 80 సెంట్ల భూమి, పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు, పంచాయితీరాజ్ పరిధిలోని ఏపీఎస్ఐఆర్డీకి 5 ఎకరాల భూమి కేటాయింపులకు ఆమోదం లభించింది. 

వీటితో పాటు ఏపీ సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్లకు, రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. 

ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




More Telugu News