గ్యాస్ సంక్షోభం.. ‘ఎస్మా’ ప్రయోగించిన కేంద్రం

  • గృహ అవసరాలకే తొలి ప్రాధాన్యమని వెల్లడి
  • హోటళ్లకు షాక్ ఇస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
  • దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మూతపడనున్న హోటళ్లు!
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా కమర్షియల్ ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. దీంతో వంట గ్యాస్ క్రమబద్ధమైన సరఫరాను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నిత్యావసర వస్తువుల చట్టం’ (ఎస్మా)ను ప్రయోగించింది. పశ్చిమాసియాలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో తలెత్తిన ఆటంకాల ఫలితంగా.. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పుడు అకస్మాత్తుగా కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. సరఫరా పునరుద్ధరించకపోతే కొన్ని రోజుల్లోనే హోటళ్లు మూతపడవచ్చని రెస్టారెంట్ అసోసియేషన్లు హెచ్చరిస్తున్నాయి.

ఏమిటీ ‘ఎస్మా’ ఆర్డర్?
పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రిఫైనరీల్లో ఉత్పత్తి అయ్యే ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ నిల్వలను కేవలం వంట గ్యాస్ తయారీకే వాడాలని, పెట్రోకెమికల్స్ తయారీకి మళ్లించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఉత్పత్తి అయిన మొత్తం గ్యాస్‌ను కేవలం ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ లకు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎస్మా చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

హోటళ్లు, రెస్టారెంట్లపై ‘సిలిండర్’ బాంబు!
గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనివల్ల బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో వందలాది హోటళ్లు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీంతో హోటళ్లను కూడా అత్యవసర సేవలుగా గుర్తించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటళ్ల అసోసియేషన్ వారు కోరుతున్నారు. దీనికి తోడు మార్చి 7 నుంచి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.60, కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది.

హర్దీప్ పూరీ భరోసా..
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ.. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి కాకుండా, అమెరికా నుంచి దాదాపు 2.2 మిలియన్ టన్నుల గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ నిల్వలు ఇప్పటికే రావడం ప్రారంభించాయని ఆయన వెల్లడించారు.


More Telugu News