అటువైపు వెళ్లొద్దు... ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం అలర్ట్

  • ఇరాన్‌లోని భారతీయులకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన
  • ముందస్తు సమాచారం లేకుండా భూ సరిహద్దుల వైపు వెళ్లవద్దని హెచ్చరిక
  • సరిహద్దు దాటాక ఇబ్బందులు పడితే సహాయం చేయలేమని స్పష్టం
  • పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ
  • ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించి, హెచ్చరికలు జారీ చేసిన సౌదీ అరేబియా
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులకు సోమవారం ఒక కీలక సూచన జారీ చేసింది. తమతో ముందుగా సంప్రదించకుండా దేశం విడిచి వెళ్లేందుకు ఏ భూ సరిహద్దు వైపు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

"భారత పౌరులు ఎంబసీ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు పొందిన తర్వాతే సరిహద్దుల వైపు ప్రయాణించాలి. ఒకవేళ ఇరాన్ భూభాగం విడిచిపెట్టాక, పొరుగు దేశంలోకి ప్రవేశం లభించక ఇబ్బందులు పడితే, ఆ తర్వాత మేం ఎలాంటి సహాయం అందించలేము" అని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు లేదా ఈ-మెయిల్ ద్వారా తమను సంప్రదించాలని సూచించింది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించినప్పటి నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత ఎంబసీ ఈ అడ్వైజరీ జారీ చేసింది.

మరోవైపు, ఇరాన్ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇది ప్రాంతీయ భద్రతకు పెను ముప్పు అని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. అయితే, తమ దాడులు ఆత్మరక్షణ కోసమేనని, పొరుగు దేశాల నుంచే తమపైకి క్షిపణులు ప్రయోగిస్తున్నారని ఇరాన్ వాదిస్తోంది. ఈ ఆరోపణలను సౌదీ అరేబియా తోసిపుచ్చింది.


More Telugu News