ఐసీసీ టీమ్ ఆఫ్ వరల్డ్ కప్... మనవాళ్లు ఎవరెవరున్నారంటే...!

  • టీ20 ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో నలుగురు భారతీయులు
  • ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్
  • జట్టుకు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్
  • జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా
  • టోర్నీ టాప్ స్కోరర్‌గా పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన నేపథ్యంలో 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'‌ను ప్రకటించింది. స్వదేశంలో కప్ గెలిచిన టీమిండియా నుంచి ఏకంగా నలుగురు ఆటగాళ్లకు ఈ ప్రతిష్ఠాత్మక జట్టులో చోటు దక్కింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'‌గా నిలిచాడు.

ఈ టోర్నీలో సంజూ శాంసన్ కేవలం ఐదు ఇన్నింగ్స్‌లలోనే 321 పరుగులు సాధించాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 89 పరుగులతో చెలరేగి, టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. శాంసన్‌తో పాటు ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'‌గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా (14 వికెట్లు), ఓపెనర్‌గా సత్తా చాటిన ఇషాన్ కిషన్ (317 పరుగులు), ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా (9 వికెట్లు, 2 అర్ధశతకాలు) ఈ జాబితాలో ఉన్నారు.

ఈ జట్టుకు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్‌ను ఎంపిక చేశారు. టోర్నీలో అత్యధిక పరుగులు (383) చేసిన పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్‌కు ఓపెనర్‌గా స్థానం లభించింది. వీరితో పాటు దక్షిణాఫ్రికా నుంచి లుంగి ఎంగిడి, ఇంగ్లండ్ నుంచి విల్ జాక్స్, ఆదిల్ రషీద్, వెస్టిండీస్ నుంచి జాసన్ హోల్డర్, జింబాబ్వే నుంచి బ్లెస్సింగ్ ముజరబానీ జట్టులో చోటు సంపాదించారు. అమెరికా ఆటగాడు షాడ్లీ వాన్ షాల్క్‌విక్‌ 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఇయాన్ బిషప్, ఇయాన్ మోర్గాన్ వంటి మాజీ ఆటగాళ్లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ జట్టును ఎంపిక చేసింది.

ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్:
సాహిబ్జాదా ఫర్హాన్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, జాసన్ హోల్డర్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడి, ఆదిల్ రషీద్, బ్లెస్సింగ్ ముజరబానీ. 12వ ఆటగాడు: షాడ్లీ వాన్ షాల్క్‌విక్.


More Telugu News