ఇరాన్ క్షిపణి దాడి.. ఇజ్రాయెల్‌లో భారత పౌరుడికి గాయాలు

  • ఇరాన్ క్షిపణి శకలాలు తగలడం వల్ల మెడకు గాయమైనట్లు వెల్లడి
  • టెల్అవివ్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన అధికారులు
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించిన అధికారులు
ఇరాన్ క్షిపణి దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో ఒక భారత పౌరుడికి గాయాలయ్యాయి. ఇరాన్ క్షిపణి నుంచి వచ్చిన శకలాలు తగలడం వల్ల అతడి మెడకు తీవ్ర గాయమైనట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఈ ఘటన జరిగిన వెంటనే అతనిని టెల్అవివ్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడే ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. బాధితుడి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

టెల్అవివ్‌లోని భారత ఎంబసీ అధికారులు ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని, అవసరమైన సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


More Telugu News