టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదే: సూర్యకుమార్ యాదవ్

  • టీ20 ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • తమ నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమేనని వెల్లడి
  • అదే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ ను కూడా గెలుస్తామని ధీమా

అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడిన జోష్‌లో ఉన్న టీమ్ ఇండియా, అప్పుడే తన తదుపరి భారీ లక్ష్యాలను ప్రకటించింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ప్రణాళికలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తర్వాతి ప్రధాన లక్ష్యం ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలవడమేనని ఆయన స్పష్టం చేశాడు.


సూర్యకుమార్ యాదవ్ మాటల ప్రకారం, 2028వ సంవత్సరం భారత క్రికెట్‌కు అత్యంత కీలకం కానుంది. "మా తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడం, అలాగే అదే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ను కూడా కైవసం చేసుకోవడం" అని సూర్య వెల్లడించాడు. దాదాపు 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2028లో లాస్ ఏంజెలెస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం క్రీడాలోకంలో ఒక చారిత్రాత్మక పరిణామం. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ పోటీల్లో గెలిచిన జట్టుకు ఇచ్చే గోల్డ్ మెడల్ కోసం భారత్ ఇప్పుడే సిద్ధమవుతోంది.


ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ వంటి క్రీడలకు కూడా చోటు దక్కింది. అయితే, ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే జట్ల అర్హత ప్రమాణాలపై ఐసీసీ ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. ఆతిథ్య దేశ హోదాలో అమెరికా నేరుగా అర్హత సాధించే అవకాశం ఉండగా, ఇతర జట్లు తమ స్థానాన్ని ఎలా ఖాయం చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఉత్సాహంలో ఉన్న భారత్, ఒలింపిక్ పతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉంది.



More Telugu News