టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్‌టైమ్ రికార్డ్!

  • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌తో జియోహాట్‌స్టార్‌లో సరికొత్త రికార్డు
  • చివరి వికెట్ పడినప్పుడు 74.5 కోట్ల మంది ఏకకాలంలో వీక్షణ
  • పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్ నాటికి 82.1 కోట్లకు చేరిన వ్యూయర్‌షిప్
  • ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌లో నమోదైన 6.5 కోట్ల రికార్డు బద్దలు
టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో సరికొత్త వీక్షకుల రికార్డును సృష్టించింది. న్యూజిలాండ్ చివరి వికెట్ పడిన సమయంలో ఏకకాలంలో ఏకంగా 74.5 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పారు.

నిన్న‌ జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సొంతగడ్డపై ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా కూడా టీమిండియా చరిత్ర సృష్టించింది. 19వ ఓవర్‌లో భారత్ గెలుపు ఖాయమవగానే వ్యూయర్‌షిప్ 74.5 కోట్లకు చేరగా, పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్ ముగిసే సమయానికి అది 82.1 కోట్లకు పెరగడం విశేషం.

ఫైనల్ మ్యాచ్‌కు వీక్షకుల సంఖ్య మొద‌టి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రికీ మార్టిన్ ప్రదర్శన సమయంలో 2.1 కోట్ల మంది వీక్షించగా, టాస్ సమయానికి ఆ సంఖ్య 4.2 కోట్లకు చేరింది. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన 6.5 కోట్ల పీక్ వ్యూయర్స్ రికార్డును ఈ ఫైనల్ సునాయాసంగా అధిగమించి, ఓటీటీ వీక్షణలో కొత్త చరిత్రను లిఖించింది. ఇది 2023లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ (5.9 కోట్లు) రికార్డును అధిగమించడం గమనార్హం.

భారత ఇన్నింగ్స్ ముగిసేసరికి వీక్షకుల సంఖ్య 43.9 కోట్లకు, ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో 44.3 కోట్లకు పెరిగింది. భారత్ నిర్దేశించిన 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు న్యూజిలాండ్ బరిలోకి దిగినప్పుడు 49.9 కోట్ల మంది వీక్షిస్తుండగా, మొదటి ఓవర్ ముగిసేసరికి ఆ సంఖ్య 50.3 కోట్లకు చేరింది. కాగా, 2024లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో డిస్నీ+హాట్‌స్టార్‌లో 5.3 కోట్ల పీక్ వ్యూయర్‌షిప్ మాత్రమే నమోదైంది. తాజా విజయంతో మైదానంలోనే కాకుండా డిజిటల్ వీక్షణలోనూ టీమిండియా సరికొత్త చరిత్ర లిఖించింది.


More Telugu News