వరల్డ్ ఛాంపియన్ భారత్... టీ20 ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర.. న్యూజిలాండ్ పై అల్టిమేట్ విక్టరీ

  • 2007, 2024 తర్వాత మూడోసారి టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత్
  • పొట్టి కప్‌ను డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు
  • ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం
  • బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ (89), బౌలింగ్‌లో బుమ్రా (4/15) అద్భుత ప్రదర్శన
  • అహ్మదాబాద్ వేదికగా 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసిన భారత్
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా మరోసారి విశ్వరూపం చూపించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తుది పోరులో న్యూజిలాండ్‌ను చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007, 2024 తర్వాత ఇది టీమిండియాకు మూడో టీ20 వరల్డ్ కప్ కావడం విశేషం. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలిజట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. దాంతోపాటే, ఆతిథ్య జట్టు వరల్డ్ కప్ నెగ్గడం కూడా ఇదే తొలిసారి. అంతేకాదు, టీ20 ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి, టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా టీమిండియా రికార్డులకెక్కింది. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది.

256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత పేస్ దళపతి జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ బౌలింగ్‌తో కివీస్ పతనాన్ని శాసించాడు. కేవలం 15 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి నడ్డి విరిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ (52), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (43) మాత్రమే పోరాడారు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. ముఖ్యంగా డారిల్ మిచెల్ (17), ఫిన్ అలెన్ (9), రచిన్ రవీంద్ర (1) వంటి స్టార్ ప్లేయర్లు విఫలమవడంతో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కేవలం 7.1 ఓవర్లలోనే 98 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీలో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.

ఆ తర్వాత ఇషాన్ కిషన్ (54)తో కలిసి సంజూ శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా శాంసన్ కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, ఏకంగా 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. చివర్లో శివమ్ దూబే (26 నాటౌట్) ధాటిగా ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయినా.. టీమిండియా సమిష్టి ప్రదర్శనతో మూడోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.


More Telugu News