కామారెడ్డిలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ

  • ఆర్థిక ఇబ్బందులతో ముగ్గురు కూతుళ్లను చెరువులో తోసి చంపిన తండ్రి
  • తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో ఈ దారుణ ఘటన
  • పిల్లలు కనబడటం లేదంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు
  • అనుమానంతో విచారించగా నేరాన్ని అంగీకరించిన నిందితుడు ఇస్మాయిల్
  • నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో ముగ్గురు పిల్లల అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక కన్న తండ్రే తన ముగ్గురు కుమార్తెలను చెరువులో తోసి చంపేశాడు. ఈ ఘటనలో షిఫత్ (8), అయత్ (7), మరియం (5) అనే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడైన తండ్రి, ఆటో డ్రైవర్ ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆదివారం ఏఎస్పీ చైతన్య రెడ్డి మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఇస్మాయిల్ తన భార్యతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఉదయం 10 గంటల నుంచి తన ముగ్గురు కూతుళ్లు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సోషల్ మీడియాలో బాలికల ఫోటోలు షేర్ చేసి గాలింపు చేపట్టారు.

విచారణలో భాగంగా, పిల్లలను అల్పాహారం కోసం హోటల్‌కు తీసుకెళ్లి తర్వాత వదిలేశానని ఇస్మాయిల్ చెప్పాడు. అయితే, ఎక్కడ వదిలేశాడనే విషయంపై పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించిన అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించగా, తానే వారిని పెద్దచెరువులో తోసి చంపినట్లు అంగీకరించాడు.

దాదాపు రూ. 5 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చలేక, పిల్లలను పోషించలేక ఈ దారుణానికి పాల్పడినట్లు ఇస్మాయిల్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. నిందితుడి భార్య షబీనా కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘాతుకం జరిగింది. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు శనివారం రాత్రి ఇద్దరి, ఆదివారం ఉదయం మరొకరి మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసులో లోతైన విచారణ కోసం నిందితుడిని పోలీస్ కస్టడీకి కోరతామని ఏఎస్పీ తెలిపారు.


More Telugu News