చిరంజీవి తదితరులకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  • ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంపిక
  • పైడి జయరాజ్ అవార్డుకు ఎంపికైన లోకనాయకుడు కమల్ హాసన్
  • అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డుకు నటి జయసుధ ఎంపిక
  • దర్శకుడు సింగీతం, నిర్మాత అశ్వినీదత్‌లకు దక్కిన పురస్కారాలు
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి 
తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన స్పెషల్ ఫిల్మ్ అవార్డుల విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సినీ రంగంలో విశేష కృషి చేసిన పలువురు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారాలు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అవార్డులకు ఎంపికైన వారందరికీ సీఎం తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ఏడాది ప్రకటించిన అవార్డుల్లో ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారానికి మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఎంపిక కాగా.. పైడి జయరాజ్ అవార్డుకు విలక్షణ నటుడు కమల్ హాసన్ ఎంపికయ్యారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డుకు సహజనటి జయసుధ ఎంపికయ్యారు.

దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావుకు బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, సీనియర్ నిర్మాత అశ్వినీదత్‌కు నాగిరెడ్డి - చక్రపాణి అవార్డు దక్కాయి. ప్రజా సమస్యలను తన సినిమాల ద్వారా ప్రతిబింబించే ఆర్ నారాయణమూర్తికి టీఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డు, రమేష్ ప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు సి.నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు లభించాయి. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఈ ప్రముఖులందరికీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.


More Telugu News