ఇంగ్లండ్‌పై విశ్వరూపం.. రోహిత్ రికార్డును దాటేసిన శాంసన్

  • టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు
  • ఒకే టోర్నీలో 16 సిక్సర్లతో సరికొత్త చరిత్ర సృష్టించిన సంజూ
  • నాకౌట్ మ్యాచ్‌లో కోహ్లీ అత్యధిక స్కోరు రికార్డు సమం
  • సెమీఫైనల్‌లో 89 పరుగులతో జట్టును ఫైనల్‌కు చేర్చిన వైనం
  • ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రేసులో ఏకైక భారతీయుడిగా సంజూ
భారత క్రికెట్ జట్టులో కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో, ఒకే టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును అతను బద్దలు కొట్టాడు.

గతంలో 2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 15 సిక్సర్లు కొట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఏకంగా 7 సిక్సర్లు బాది, టోర్నీలో తన మొత్తం సిక్సర్ల సంఖ్యను 16కు పెంచుకున్నాడు. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూ, భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ ఇన్నింగ్స్‌తో సంజూ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ (2016లో 89*) పేరిట ఉన్న రికార్డును అందుకున్నాడు. టోర్నీలో నిలకడగా రాణిస్తుండటంతో "ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్" అవార్డు రేసులో ఉన్న ఏకైక భారతీయుడిగానూ సంజూ నిలిచాడు.

ఈ ప్రపంచకప్‌ను బెంచ్‌పైనే ప్రారంభించిన సంజూ శాంసన్, సూపర్-8 దశలో జట్టులోకి వచ్చాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ, వెస్టిండీస్‌పై అజేయంగా 97 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. అదే జోరును సెమీఫైనల్‌లోనూ కొనసాగించి జట్టు విజయంలో భాగమయ్యాడు. ఆదివారం జరగనున్న ఫైనల్‌లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేసి, జట్టుకు కప్పు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.


More Telugu News