అలాంటి వారిని నిలదీసే రోజులు రావాలి: తన మీద ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం

  • హోలీ కార్యక్రమంలో అనసూయను చూసి 'అంటీ' అంటూ కేకలు
  • ఈ వీడియోకు వచ్చిన కామెంట్లతో రీల్స్ చేసిన వ్యక్తులపై అనసూయ ఆగ్రహం
  • ఇతరుల బాధల్లో వినోదం వెతికేవారిని నిలదీయాలన్న అనసూయ
  • అందరూ నాకెందుకులే అనుకుంటే సర్వసాధారణంగా మారుతాయని ఆవేదన
ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజులు రావాలని, అందరూ నాకెందుకులే అనుకుంటే ఇలాంటివి సర్వసాధారణంగా మారుతాయని ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ అన్నారు. అనసూయ హోలీ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదిక మీద డ్యాన్స్ చేసి అలరించారు. ఆ తర్వాత ఆమె మైక్ తీసుకుని మాట్లాడారు.

ఆమె మాట్లాడటం ప్రారంభించగానే కొందరు వ్యక్తులు 'ఆంటీ' అంటూ కేకలు చేశారు. అయితే దానిని పట్టించుకోకుండా అనసూయ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోకు పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోకు వచ్చిన కామెంట్లతో కొందరు రీల్స్ చేశారు. దీనిపై అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇతరుల బాధలో ఆనందాన్ని వెతుక్కోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై వచ్చిన విమర్శల కామెంట్లతో రీల్స్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇతరుల బాధలో ఆనందం వెతుక్కోవడం సరికాదని అన్నారు. పక్కవారి పట్ల కనీస సానుభూతి, సామాజిక బాధ్యత లేని వారిని ఈ సమాజం నిలదీసే రోజు రావాలని అన్నారు. వయస్సును బట్టి హేళన చేయడం, మహిళలపై వివక్ష చూపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇలాంటి వారిని చూసి సమాజం సిగ్గుపడాలని, అందరూ నాకెందుకులే అని వదిలేస్తే నిత్యం జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఇలాంటి అంశాల పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే క్రమంగా మానవత్వం కోల్పోతామని అన్నారు.

ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి ఎప్పుడూ మొహమాటపడనని అనసూయ పేర్కొన్నారు. సాధించిన విజయాలు, తన ప్రయాణం తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఇలాంటి విమర్శలను ఎన్నింటినో తట్టుకుని నిలబడ్డానని, అందుకే ఈ స్థాయికి వచ్చానని తనను కామెంట్ చేసిన నెటిజన్లను ఉద్దేశించి అన్నారు. ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన తనను విమర్శించడానికి మీరెవరను ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News