శ్రీలంక దిశగా రెండో ఇరాన్ యుద్ధ నౌక: పార్లమెంటులో వెల్లడించిన శ్రీలంక మంత్రి

  • నిన్న శ్రీలంక సమీపంలో యుద్ధ నౌకను ముంచివేసిన అమెరికా
  • తాజాగా రెండో యుద్ధ నౌకను గుర్తించిన శ్రీలంక
  • నౌకలో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడి
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం వేళ, మరో ఇరాన్ యుద్ధ నౌక శ్రీలంక దిశగా వెళుతోంది. నిన్న ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక ఐరిస్ దేనాను అమెరికా జలాంతర్గామి ముంచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇరాన్ కూడా అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మరో ఇరాన్ నౌక శ్రీలంక దిశగా ప్రయాణిస్తోంది. ఈ విషయాన్ని శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా వెల్లడించారు.

గురువారం నాడు పార్లమెంటులో రెండవ ఇరాన్ నౌక గురించి శ్రీలంక ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస అడిగిన ప్రశ్నకు మంత్రి సలిందా జయతిస్సా సమాధానమిచ్చారు. మన దేశ ప్రాదేశిక జలాలకు సమీపంలో ఆ నౌక ఉందని, అందులో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

కాగా, ఈ నౌకపై కూడా అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో దాదాపు 100 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. అయితే ఈ నౌక అత్యవసర పోర్ట్ కాల్ కోసం ప్రభుత్వ అనుమతిని కోరిందని, క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నట్లు శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్సా తెలిపారు.


More Telugu News