రేపు ఇంగ్లండ్‌తో సెమీస్... సిద్ధివినాయకుడ్ని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు

  • సెమీస్‌కు ముందు సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన సూర్యకుమార్, తిలక్
  • రేపు వాంఖడే వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడనున్న భారత్
  • సూర్యతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అర్ధాంగి దేవిషా
  • ఇప్పటికే గణపయ్య ఆశీస్సులు తీసుకున్న అక్షర్, ఇషాన్, అభిషేక్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువ బ్యాటర్ తిలక్ వర్మ బుధవారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. రేపు వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ కీలక సమరానికి ముందు వినాయకుడి ఆశీస్సులు కోరుతూ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యకుమార్ తన అర్ధాంగి దేవిషాతో కలిసి ఆలయానికి రాగా, ఆలయ అధికారులు వారిని సత్కరించారు. అంతకుముందు అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రస్తుత టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరింటిని గెలిచి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి మినహా టీమిండియా ప్రదర్శన బలంగా ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, తిలక్ వర్మ 15 బంతుల్లో 27 పరుగులు చేసి తన వంతు పాత్ర పోషించాడు. టోర్నీ ఆరంభంలో ఇబ్బంది పడ్డ తిలక్, జింబాబ్వే మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్స్‌తో తలపడేందుకు ఇంగ్లండ్ కూడా సిద్ధంగా ఉంది. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు సూపర్-8 దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఊపుమీదుంది. రెండు బలమైన జట్ల మధ్య పోరు కావడంతో వాంఖడేలో జరగనున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.




More Telugu News