రాహుల్ గాంధీకి మంద కృష్ణ మాదిగ లేఖ

  • మాదిగ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ అణచివేస్తోందన్న మంద కృష్ణ
  • మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలని డిమాండ్
  • సీడబ్ల్యూసీలో ఒక్క మాదిగ కూడా లేరని విమర్శ

కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణచివేస్తోందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి మాదిగలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు.


తెలంగాణకు చెందిన మాదిగ సామాజిక వర్గ నేతకు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా మాదిగలకు టికెట్లు ఇవ్వలేదని, ఫలితంగా ప్రస్తుతం పార్లమెంట్‌లో తెలంగాణ నుండి మాదిగల గొంతు వినిపించే వారే లేకుండా పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక్క మాదిగ కూడా లేకపోవడం వారి పట్ల పార్టీకి ఉన్న వివక్షకు నిదర్శనమని మంద కృష్ణ విమర్శించారు. మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప, పదవుల్లో తగిన వాటా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.



More Telugu News