మందు తాగి దురుసుగా ప్రవర్తించిన సినీ దర్శకుడి కుమారుడిపై కేసు నమోదు
- బంజారాహిల్స్ లో డైరెక్టర్ మణిశంకర్ కుమారుడు ప్రేమ్ శంకర్ డ్రంకెన్ డ్రైవ్
- ఛార్జింగ్ అయిపోవడంతో రోడ్డు మధ్యలోనే ఆగిపోయిన కారు
- పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వైనం
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో మద్యం మత్తులో ట్రాఫిక్ హోంగార్డుపై దురుసుగా ప్రవర్తించిన సినీ దర్శకుడి కుమారుడిపై కేసు నమోదైంది. ప్రముఖ దర్శకుడు మణిశంకర్ తనయుడు ప్రేమ్ శంకర్ తన ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తుండగా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3 వద్ద కారు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయి రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. రాత్రి వేళ కావడంతో దీనివల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పక్కకు జరిపేందుకు సహకరించాలని అక్కడే ఉన్న ట్రాఫిక్ హోంగార్డు మన్యం కోరగా, కారులో ఉన్న ప్రేమ్ శంకర్ సహకరించకుండా మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేసేందుకు హోంగార్డు ప్రయత్నించగా నిరాకరించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులు టోయింగ్ వాహనం తెప్పించి కారును తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసులు అతడిని పట్టుకుని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ప్రేమ్ శంకర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.