ఖమేనీ హత్యపై సోషల్ మీడియాలో పోస్టులు... శ్రీనగర్ ఎంపీపై కేసు నమోదు
- కశ్మీర్ లో జరిగిన నిరసనల వీడియోలు పోస్ట్ చేసిన రుహుల్లా మెహదీ
- ప్రజల్లో భయాందోళనలు కలిగించే పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు
- బెదిరింపులకు తాను లొంగేది లేదన్న రుహుల్లా
శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో 'తప్పుదోవ పట్టించే కంటెంట్'ను షేర్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను, అలాగే షియా ముస్లింలు ఆరాధ్య దైవంగా భావించే అయతుల్లా అలీ ఖమేనీ హత్యను రుహుల్లా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కశ్మీర్లో జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలను ఆయన పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది.
ఈ ఎఫ్ఐఆర్ పై రుహుల్లా కార్యాలయం ఘాటుగా స్పందించింది. "ఒక దేశ సార్వభౌమాధికారి హత్యను ఖండించే ధైర్యం లేని యంత్రాంగం, ఆ విషయాన్ని ప్రశ్నించిన వ్యక్తిపై కేసు పెట్టే ధైర్యం మాత్రం చేస్తోంది" అని విమర్శించింది. మరోవైపు, ప్రజల్లో భయాందోళనలు కలిగించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందునే ఈ కేసు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని కఠిన సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.
అయితే, ఇలాంటి బెదిరింపులకు తాను లొంగేది లేదని రుహుల్లా స్పష్టం చేశారు. "శ్రీనగర్ ప్రజలు తమ ఎంపీని ప్రభుత్వానికి నచ్చినట్లు మాట్లాడటానికి ఎన్నుకోలేదు, నిజం చెప్పడానికే ఎన్నుకున్నారు" అని ఆయన పేర్కొన్నారు. తన భద్రతను తగ్గించడం, ఫేస్బుక్ ఖాతాను నిలిపివేయడం వంటి చర్యల ద్వారా తన గొంతును నొక్కలేరని, తన తండ్రి బాటలోనే ప్రజల కోసం నిలబడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.