నా కొడుకు పుట్టినరోజుకు కూడా నన్ను దూరం చేశారు: బాల్క సుమన్

  • ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్
  • తనపై రివర్స్‌లో అక్రమ కేసులు పెట్టారని మండిపాటు
  • కాంగ్రెస్ నేతల కడుపు మంట తగ్గిందని వ్యాఖ్య

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మునిసిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి సుమన్ తో పాటు మరికొందరు నేతలు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 


పోలీసులు తమపై లాఠీచార్జ్ చేయడమే కాకుండా, రివర్స్‌లో అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా, మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత సిబ్బందిలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఎన్నడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, తనను జైలులో పెట్టడం ద్వారా అధికార పార్టీ నాయకుల కడుపు మంట తగ్గిందని అన్నారు. హోలీ పండుగ మరియు తన కుమారుడి పుట్టినరోజున కూడా తనను దూరంగా ఉంచారని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.



More Telugu News