హెచ్‌సీఏకు వ్యతిరేకంగా జింఖానా గ్రౌండ్‌లో ఆందోళన.. స్పందించిన అధ్యక్షుడు

  • విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.68.73 కోట్లు చెల్లించారని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆందోళన
  • వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • తాను బాధ్యతలు తీసుకోవడానికి ముందే ఈ చెల్లింపులు జరిగాయన్న అధ్యక్షుడు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందంటూ హైదరాబాద్‌లోని జింఖానా మైదానం వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.68.73 కోట్లు చెల్లించారని, ఇందులో కుంభకోణం ఉందని, ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

క్రీడాకారులకు అన్యాయం చేసి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించిన రూ.68.73 కోట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఆరోపణలపై హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అమర్నాథ్ స్పందించారు. ఈ చెల్లింపుల వెనుక తన ప్రమేయం లేదని ఆయన మీడియా ముఖంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ఆయనను అడ్డుకుని నగదును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జింఖానా మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఆరోపణలను ఖండించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు

తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను హెచ్‌సీఏ అధ్యక్షుడు ఖండించారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ చెక్కుపై సంతకం చేయలేదని స్పష్టం చేశారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.68.73 కోట్ల చెల్లింపులో తన ప్రమేయం లేదని అన్నారు. తాను బాధ్యతలు చేపట్టకముందే ఈ చెల్లింపులు జరిగినట్లు తెలిపారు.


More Telugu News