US Embassy: చేతులెత్తేసిన ట్రంప్ ప్రభుత్వం... ఇజ్రాయెల్ లోని అమెరికన్లకు షాక్..!

US Embassy Shock to Americans in Israel
  • ఇప్పుడు తరలించడం సాధ్యం కాదన్న ఎంబసీ
  • షెల్టర్లలో తలదాచుకోవాలని తన పౌరులకు సూచన
  • ‘తాబా’ సరిహద్దు దాటడానికి ఇజ్రాయెల్ షటిల్ సర్వీసులు
  • ఇలా ప్రయాణించే వారి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమని హెచ్చరిక
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తదుపరి నోటీసు ఇచ్చే వరకు తమ నివాసాల్లోనే లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికన్లను ఇజ్రాయెల్ నుంచి ఖాళీ చేయించే స్థితిలో లేదా నేరుగా వారికి సహాయం చేసే స్థితిలో రాయబార కార్యాలయం లేదు’’ అని జెరూసలేంలోని అమెరికా ఎంబసీ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన భద్రతా హెచ్చరికలో స్పష్టం చేసింది.

తరలింపు ప్రక్రియ ఇలా..
ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ నిన్నటి నుండి ‘తాబా’ సరిహద్దు దాటడానికి షటిల్ సర్వీసులను నడపడం ప్రారంభించిందని ఎంబసీ తెలిపింది. ఈ షటిల్ సర్వీసులో ప్రయాణించాలనుకునే పౌరులు పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క ఎవాక్యూషన్ ఫామ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించింది. ఈజిప్టుకు వెళ్లే తాబా భూ సరిహద్దు ప్రస్తుతం అందుబాటులో ఉందని, ఇది రోజుకు 24 గంటలు పనిచేస్తుందని పేర్కొంది.

ఎంబసీ కీలక సూచన..
‘‘పర్యాటక మంత్రిత్వ శాఖ నడుపుతున్న ఈ షటిల్ సర్వీసుల విషయంలో అమెరికా రాయబార కార్యాలయం ఎటువంటి సిఫార్సు చేయడం లేదు. ఒకవేళ మీరు ఈ మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకుంటే, మీ భద్రతకు అమెరికా ప్రభుత్వం ఎటువంటి గ్యారెంటీ ఇవ్వదు. ఇజ్రాయెల్ వదిలి వెళ్లాలనుకునే వారికి కేవలం సమాచార సేకరణ కోసం మాత్రమే ఈ వివరాలు అందిస్తున్నాము’’ అని ఎంబసీ స్పష్టం చేసింది. అలాగే, జోర్డాన్ వెళ్లాలనుకునే వారు ఎయిలాట్ వరకు షటిల్‌లో వెళ్లి, అక్కడి నుండి స్వతంత్రంగా ‘యిత్జాక్ రాబిన్’ సరిహద్దుకు చేరుకోవచ్చని అమెరికా రాయబార కార్యాలయం వివరించింది.
US Embassy
Israel
American citizens
Jerusalem
Taba border
Evacuation
Travel advisory
Shuttle service
Egypt
Yitzhak Rabin border

More Telugu News