ఇన్వెస్టర్లలో యుద్ధ భయాలు... కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లలో భారీ పతనం
- ఒక్కరోజే 1048 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- గత ఏడాది సెప్టెంబర్ తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయిన మార్కెట్లు
- 25 శాతం మేర పెరిగిన వొలటాలిటీ ఇండెక్స్
- భారీగా నష్టపోయిన ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు
మార్కెట్లో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతూ.. వోలటాలిటీ ఇండెక్స్ ఏకంగా 25.01 శాతం పెరిగి 17.13కి చేరింది. నిఫ్టీ 50లో కేవలం బీఈఎల్, సన్ ఫార్మా, ఐటీసీ షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా.. ఇండిగో 6.25 శాతం నష్టంతో టాప్ లూజర్గా నిలిచింది. మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో ఇండెక్స్ అత్యధికంగా 2.20 శాతం పడిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలోనూ ఒత్తిడి కనిపించింది. అయితే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మాత్రం 0.24 శాతం లాభపడి సానుకూలంగా ముగిసింది.
ప్రస్తుత మార్కెట్ సరళిపై నిపుణులు స్పందిస్తూ.. నిఫ్టీకి 24,600 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని తెలిపారు. ఈ స్థాయిని కోల్పోతే మార్కెట్లు మరింత పతనం అయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఎగువన 25,000 పాయింట్ల వద్ద నిరోధం ఉందని, నిఫ్టీ ఆ స్థాయి పైన స్థిరపడే వరకు బేర్స్ ఆధిపత్యం కొనసాగవచ్చని విశ్లేషించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీల కంటే ఎక్కువగా నష్టపోయాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారని, లాభాల స్వీకరణ వైపు చూస్తున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.