బ్యారెల్‌కు ఒక డాలర్ పెరిగినా భారత్ పై ఏటా రూ.13 వేల కోట్ల భారం

  • హార్మూజ్ జలసంధి మూసివేతతో మండుతున్న చమురు ధరలు
  • చమురు వినియోగంలో ప్రపంచంలోనే మూడో దేశంగా భారత్
  • దేశంలో రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు వినియోగం
  • అందులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు హార్మూజ్ జలసంధి గుండానే దిగుమతి
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంది. దీంతో సోమవారం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ క్రూడ్‌ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్‌కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఫ్యూచర్స్‌లో బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగి 82.37 డాలర్లకు పెరిగింది. 2025 జనవరి తర్వాత ముడిచమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. గల్ఫ్ తీరంలో మూడు చమురు ట్యాంకర్లను దెబ్బతీశామని ఇరాన్ ప్రకటించడంతో సరఫరా నిలిచిపోతుందనే భయంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

భారత్‌పై పడే భారం..
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్‌కు ఈ ధరల పెరుగుదల గొడ్డలిపెట్టులా మారింది. గతేడాది 160 బిలియన్ డాలర్ల మేర చమురును భారత్ దిగుమతి చేసుకుంది. గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర కేవలం ఒక్క డాలర్ పెరిగినా, భారత్ ఏడాదికి అదనంగా రూ.13,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుండగా, అందులో 1.5 నుంచి 2 మిలియన్ బ్యారెళ్లు వివాదాస్పద హార్మూజ్ జలసంధి గుండానే దిగుమతి అవుతోంది. ఇప్పటికే రష్యా నుంచి సరఫరా తగ్గడంతో పశ్చిమాసియాపై ఆధారపడిన భారత్‌కు ఇప్పుడు ఈ యుద్ధం భారీ ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చేలా కనిపిస్తోంది.

మరో 74 రోజుల వరకు బేఫికర్..
చమురు సరఫరాకు ఆటంకం కలిగినా తట్టుకునేందుకు భారత్ వద్ద వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గతంలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో దేశ అవసరాలకు 74 రోజుల పాటు ఈ నిల్వలు సరిపోతాయి. అయితే, యుద్ధం దీర్ఘకాలం కొనసాగి ధరలు ఇలాగే పెరిగితే మాత్రం దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడిపై ధరల భారం పడే ప్రమాదం ఉంది.


More Telugu News