టీ20 వరల్డ్ కప్ లో సఫారీల జైత్రయాత్ర... జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో విజయం

  • కీలక సమయంలో డివాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్
  • మ్యాచ్‌ను ముగించిన జార్జ్ లిండే, ట్రిస్టన్ స్టబ్స్
  • సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనున్న సఫారీలు
టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా తన జైత్రయాత్రను కొనసాగించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన సూపర్-8 పోరులో జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీలో ఇప్పటిదాకా ఏకైక అజేయ జట్టుగా నిలిచిన సఫారీలు, కోల్‌కతాలో జరగనున్న సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనున్నారు.

154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్, కెప్టెన్ సికందర్ రజా తన స్పిన్ మాయాజాలంతో క్వింటన్ డికాక్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్‌లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చారు. ర్యాన్ రికెల్టన్ (31) మూడు సిక్సర్లతో విరుచుకుపడినా, బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్‌లో అవుట్ అవ్వడంతో సఫారీలు 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డివాల్డ్ బ్రెవిస్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 42 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. డేవిడ్ మిల్లర్ కూడా దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా కోలుకుంది. అయితే రజా, ముజరబానీలు ఈ ఇద్దరినీ అవుట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. 

చివర్లో జార్జ్ లిండే (30 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (21 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మరో 13 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ జోడీ స్ట్రైక్ రొటేట్ చేస్తూ దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించింది.

సంక్షిప్త స్కోర్లు:
జింబాబ్వే: 153/7 (సికందర్ రాజా 73, క్లైవ్ మదాండే 26*; క్వెనా మఫాకా 2-21)
దక్షిణాఫ్రికా: 154/5 (డెవాల్డ్ బ్రెవిస్ 42, ర్యాన్ రికెల్టన్ 31; సికందర్ రాజా 3-29)


More Telugu News