ఇరాన్‌ పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

  • అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్ రాయబారి సూచన
  • షెల్టర్లకు సమీపంలోనే ఉండాలని హెచ్చరికలు
  • టెహ్రాన్ లోని ఖమేనీ ఆఫీసుకు సమీపంలో క్షిపణి దాడి..
  • సుప్రీం లీడర్ క్షేమంగానే ఉన్నారన్న అధికారులు
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

ప్రధాన సూచనలు..
  • ఇజ్రాయెల్ అధికారులు, ‘హోమ్ ఫ్రంట్ కమాండ్’ జారీ చేసే భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తప్పనిసరిగా పాటించాలి.
  • నివాస ప్రాంతాల్లో లేదా కార్యాలయాల వద్ద ఉన్న రక్షణ కేంద్రాలు, సురక్షిత గదుల గురించి ముందే తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో వెంటనే అక్కడికి చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
  • ఇజ్రాయెల్ దేశం లోపల అత్యవసరం కాని ప్రయాణాలను ప్రస్తుతానికి పూర్తిగా వాయిదా వేసుకోవాలి.
  • స్థానిక వార్తలు, అధికారిక ప్రకటనలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనిస్తూ ఉండాలి.

టెహ్రాన్‌ లో భీకర దాడులు..
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్‌ లోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయానికి సమీపంలోనే దాడులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే, ఆ సమయంలో ఖమేనీ టెహ్రాన్‌ లో లేరని, అధికారులు ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించారని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.


More Telugu News