: మంత్రితో మీటింగ్ కు డుమ్మా.. మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు

  • రిమైండర్ పంపినా హాజరు కాబోనంటూ మెసేజ్ పంపిన అధికారి
  • శాసనసభను అవమానించడమేనన్న స్పీకర్
  • సభలో సీరియస్ అయిన మంత్రి పంకజ ముండే
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్న బీజేపీ సభ్యుడు   
మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పంకజ ముండేకు వింత అనుభవం ఎదురైంది. శాఖాపరమైన అంశాలపై చంద్రపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఐఏఎస్ అధికారి, ఎంపీసీబీ మెంబర్ సెక్రెటరీ ఎం.దేవేందర్ సింగ్‌ గైర్హాజరయ్యారు. కీలక సమావేశం అనీ, తప్పకుండా హాజరుకావాలని మంత్రి రిమైండర్ పంపినప్పటికీ ఖాతరు చేయలేదు. తాను రావడంలేదని మంత్రికి మెసేజ్ పంపించారు. ఈ విషయాన్ని మంత్రి పంకజ ముండే అసెంబ్లీలో ప్రస్తావిస్తూ.. ఐఏఎస్ అధికారి నిర్లక్ష్యంపై మండిపడ్డారు.

దీంతో ప్రొటెం స్పీకర్ దిలీప్ లాండే సీరియస్ గా స్పందించారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై 24 గంటల్లోనే స్పందించిన ప్రభుత్వం.. ఎం.దేవేందర్ సింగ్ తో పాటు ఎంపీసీబీ జాయింట్ డైరెక్టర్ సతీష్ పద్వాల్‌ ను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాలంలో దేవేందర్ సింగ్ ముంబై విడిచి వెళ్లకూడదని, అనుమతి లేకుండా ఎలాంటి ఇతర పనులు చేయకూడదని ప్రభుత్వం షరతులు విధించింది.

అసలేం జరిగిందంటే..
చంద్రాపూర్ జిల్లాలోని కాలుష్య సమస్యపై ఈ నెల 26న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పూర్తి వివరాలు ఇవ్వాలని స్పీకర్ కోరగా.. మంత్రి పంకజ ముండే నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘‘నేను సమాచారం అడిగితే అధికారులు మీటింగ్‌కు రాలేదు.. రిమైండర్లు పంపినా రానని మెసేజ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను సభకు ఎలా సమాధానం చెప్పగలను?’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రోటెం స్పీకర్ దిలీప్ లాండే.. ఇది శాసనసభను అవమానించడమేనని మండిపడ్డారు.

బీజేపీ నేత రియాక్షన్..
బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివర్ మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఎమ్మెల్యేలు మారుతుంటారు కానీ మేము ఇక్కడే ఉంటాం అన్న అహంకారం అధికారుల్లో పెరిగిపోయింది. రాజ్యాంగాన్ని గౌరవించని అధికారులను జైల్లో పెట్టాలి" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

More Telugu News