చంద్రబాబు శిక్ష అనుభవించే కాలం దగ్గరపడింది: లక్ష్మీపార్వతి
- కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అన్న లక్ష్మీపార్వతి
- దేవుడిపై చంద్రబాబుకు నమ్మకం లేదని విమర్శ
- లడ్డూలో కల్తీ నెయ్యి వెనుక హెరిటేజ్ హస్తం ఉందని ఆరోపణ
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు 'కుట్రలకు కేరాఫ్ అడ్రస్' అని ఆమె అభివర్ణించారు. నిస్సిగ్గు రాజకీయాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ అని, చేసిన పాపాలకు శిక్ష అనుభవించే కాలం దగ్గరపడిందని మండిపడ్డారు.
తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ... దేవుడిపై నమ్మకం లేని చంద్రబాబు, రాజకీయ లబ్ధి కోసమే ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టారని ఆరోపించారు. లడ్డూలో కల్తీ నెయ్యి వెనుక హెరిటేజ్ హస్తం ఉందని తేలింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అవసరాల కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేశారని, చివరకు మోదీ, కాంగ్రెస్ నాయకత్వాలను కూడా తన స్వార్థం కోసం వాడుకున్నారని విమర్శించారు.
లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యం తప్ప చంద్రబాబుకు ప్రజా శ్రేయస్సు పట్టదని, రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆ ప్రాంతానికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. జగన్, వైవీ సుబ్బారెడ్డి కుటుంబాలపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు ఆయన నీచ రాజకీయాలకు పరాకాష్ఠ అని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు.