కత్తితో దొంగలను తరిమిన ఎన్నారై మహిళ.. బైక్ వదిలేసి పరారైన దుండగులు

  • దోపిడీకి యత్నించిన దుండగులను ఎదుర్కొన్న ఎన్నారై మహిళ
  • భయంతో బైక్ వదిలేసి పరారైన దొంగలు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. ఇద్దరి అరెస్ట్
పంజాబ్‌లో ఓ ఎన్నారై మహిళ దొంగలకు చుక్కలు చూపించారు. తనను దోచుకోవడానికి ప్రయత్నించిన దుండగులపై కత్తితో ఎదురుదాడికి దిగడంతో వారు బైక్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సాహసోపేత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియాలో నివసించే హర్జింద్ కౌర్ ఇటీవల పంజాబ్‌కు వచ్చారు. తన అత్త, అమ్మమ్మతో కలిసి లూధియానాలోని బంధువుల ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిర్మానుష్య ప్రదేశంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారి కారును వెంబడించారు. కాసేపటికే కారు ముందు అద్దంపై కోడిగుడ్లు విసిరారు.

అద్దం సరిగా కనిపించక కారు ఆపితే దోచుకోవాలన్నది దొంగల పథకం. అయితే, హర్జింద్ కౌర్ ఏమాత్రం భయపడలేదు. వెంటనే కారులో ఉన్న కత్తిని తీసుకుని కిందకు దిగి, వారిపైకి దూసుకెళ్లారు. ఊహించని ఈ పరిణామానికి దొంగలు నివ్వెరపోయి, ప్రాణభయంతో బైక్‌ను కూడా వదిలేసి పారిపోయారు.

కారులో ఉన్న ఆమె అత్తయ్య ఈ ఘటనను తన ఫోన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై కేసు నమోదు చేసి, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు లుధియానా పోలీసులు తెలిపారు. హర్జింద్ కౌర్ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి "కోడిగుడ్ల గ్యాంగ్" పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


More Telugu News