Jagan: ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై జగన్ విమర్శలు
- ఏపీ సమ్మిట్లో నిన్న మధ్యాహ్నం యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
- టీ షర్టులు విప్పేసి నినాదాలు చేసిన వైనం
- అందరూ సిగ్గుపడేలా యూత్ కాంగ్రెస్ వ్యవహరించిందన్న జగన్
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో నిన్న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎగ్జిబిషన్ హాల్ నంబర్-5 వద్ద నిరసనకు దిగారు. పదుల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు హఠాత్తుగా టీ-షర్టులు విప్పేసి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి టీ-షర్టులపై ‘ఎప్స్టీన్స్ ఫైల్స్’, ‘మోదీ రాజీపడ్డారు’ వంటి వాక్యాలు, ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోలు ముద్రించి ఉన్నాయి.
సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు నిరసనకారులను ప్రశ్నించగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని నిరసనకారులను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటన సదస్సు ప్రాంగణంలో కలకలం రేపింది.
ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ఏఐ సమ్మిట్ లో మనమంతా సిగ్గుపడేలా యూత్ కాంగ్రెస్ వ్యవహరించిందని మండిపడ్డారు. మన రాజకీయాలు ఎటువైపు వెళుతున్నాయని ప్రశ్నించారు. మన దేశాన్ని ఎవరూ, ఎప్పుడూ కించపరచకూడదని చెప్పారు. మన మధ్య ఎలాంటి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ... ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలని అన్నారు.