తిరుమల లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిషన్... 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

  • తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై ఏపీ ప్రభుత్వం సీరియస్
  • విచారణకు రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్‌కుమార్‌తో ఏకసభ్య కమిషన్
  • సిట్ నివేదిక తర్వాత మరిన్ని వివరాల కోసం లోతైన దర్యాప్తు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ కుంభకోణంపై లోతైన విచారణ జరిపేందుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. విచారణను 45 రోజుల్లో పూర్తి చేసి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులను గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఈ వ్యవహారంపై గతంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఒక నివేదికను సమర్పించింది.

అయితే, సిట్ నివేదికలోని కొన్ని అంశాలపై మరింత స్పష్టత అవసరమని, కుట్ర వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులను గుర్తించాల్సి ఉందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే లోతైన దర్యాప్తు కోసం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆందోళన రేకెత్తించిన ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.


More Telugu News