స్కూల్ స్టూడెంట్‌లా పాక్ ప్రధాని.. ప్రపంచ దేశాధినేతల ముందు అభాసుపాలైన షరీఫ్!

  • మీటింగ్ మధ్యలో షరీఫ్ ను నిలబెట్టిన ట్రంప్
  • భారత్, పాక్ యుద్ధం ఆపింది తానే కదా అని ప్రశ్న
  • నిజమో, కాదో అందరిముందూ చెప్పాలన్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దౌత్య మర్యాదలకు కొత్త భాష్యం చెబుతున్నారు. వాషింగ్టన్‌లో గురువారం జరిగిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సదస్సులో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ పట్ల ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గాజా పునర్నిర్మాణం కోసం ఉద్దేశించిన ఈ ఉన్నత స్థాయి సమావేశం కాస్తా పాక్ ప్రధానికి జరిగిన ‘అవమానం’తో వార్తల్లోకి ఎక్కింది.

‘‘నిలబడి సాక్ష్యం చెప్పు..’’
సమావేశంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి ట్రంప్ ప్రసంగిస్తూ.. గతంలో తాను రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఎలా ఆపగలిగారో వివరించారు. ‘‘భారత్, పాకిస్థాన్ మధ్య పెను యుద్ధం జరగకుండా నేనే అడ్డుకున్నాను. వాణిజ్యపరమైన కఠిన ఆంక్షలు విధిస్తానని హెచ్చరించి కోట్ల మంది ప్రాణాలను కాపాడాను’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎదురుగా కూర్చున్న షెహబాజ్ షరీఫ్‌ను ఉద్దేశించి.. ‘‘ఇది నిజమే కదా? నీకు తెలిసిన సత్యాన్ని అందరి ముందు నిలబడి చెప్పు’’ అంటూ అనూహ్యమైన ఆదేశం జారీ చేశారు.

విస్మయానికి గురైన ప్రపంచ దేశాధినేతలు
అమెరికా అధ్యక్షుడి నుండి ఆ స్థాయి హుకుం రావడంతో షెహబాజ్ షరీఫ్ షాక్‌ కు గురయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సీటులోంచి లేచి నిలబడాల్సి వచ్చింది. ఒక దేశ ప్రధానిని పాఠశాల విద్యార్థిలా నిలబెట్టి ప్రశ్నించడంపై దౌత్య నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో షరీఫ్ ముఖంలో కనిపించిన అసౌకర్యం, తల వంచుకుని నిలబడిన తీరు పాకిస్థాన్ యొక్క బలహీన స్థితికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మీటింగ్ తర్వాత షరీఫ్ ‘సెల్యూట్’..
ఈ సమావేశం ముగిసిన తర్వాత ట్రంప్ వెళ్లిపోతుండగా షెహబాజ్ షరీఫ్ ఆయనకు ఎంతో వినయంగా ‘సెల్యూట్’ చేస్తూ కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పుల కోసం అల్లాడుతున్న పాకిస్థాన్, అమెరికా సాయం కోసం ఇంతలా దిగజారాలా అని ఆ దేశ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.


More Telugu News