చదువు కోసం టవర్ ఎక్కిన వివాహిత!

సాధారణంగా ప్రేమ కోసమో, పెళ్లి కోసమో టవర్లు ఎక్కే ఘటనలు చూస్తుంటాం. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా బోర్సీ గ్రామంలో ఒక వివాహిత తన ‘చదువు’ కోసం హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి సంచలనం సృష్టించింది. సదరు యువతికి చదువుకోవాలనే బలమైన కోరిక ఉన్నా ఆమె భర్త కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఎంత ప్రాధేయపడ్డా వారు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి.. గ్రామ శివార్లలోని 400 కిలోవాట్ల హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కింది. తనను చదువుకోనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అక్కడి నుంచి హెచ్చరించింది.

3 గంటల పాటు ఉత్కంఠ..

యువతి టవర్ ఎక్కడంతో గ్రామస్థులు ఆందోళనకు గురై పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, దాదాపు మూడు గంటల పాటు ఆమెతో చర్చలు జరిపారు.

కుటుంబ సభ్యుల అంగీకారం..
పోలీసులు, అధికారుల సమక్షంలో ఆమెను చదువుకోనిస్తామని భర్త కుటుంబం హామీ ఇచ్చింది. దీంతో శాంతించిన యువతి కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదువుపై ఆమెకున్న మక్కువను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

Married Woman
Indore
Madhya Pradesh
Education
Suicide Threat
Family Dispute
Police Intervention
Borasi Village

More Telugu News