Kesineni Chinni: విజయవాడ రైల్వే స్టేషన్ రూపురేఖలే మారిపోతాయ్: కేశినేని చిన్ని
- డీఆర్ఎంతో సమావేశమైన కేశినేని చిన్ని
- విజయవాడ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంపై సుదీర్ఘ చర్చ
- రాయనపాడు స్టేషన్ త్వరలోనే మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుందని వెల్లడి
విజయవాడ రైల్వే ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణం అంశాలపై టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఈరోజు రైల్వే డీఆర్ఎంతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ... సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఏపీకి రైల్వేలు, అమరావతి రైల్వే స్టేషన్, కొత్త రైల్వే లైన్లు తాజా బడ్జెట్లో ఉండేలా కృషి చేశారని ప్రశంసించారు.
విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ గురించి పార్లమెంట్లో తాము ప్రస్తావించగానే రైల్వే మంత్రి వెంటనే ప్రక్రియ ప్రారంభించారని... నీతి ఆయోగ్ నుంచి కూడా అనుమతి వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు. ప్రీ-బిడ్ మీటింగ్లు కూడా జరిగాయని... పీపీపీ మోడల్లో ఈ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఈ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తి అయితే అమృత్ భారత్ స్టేషన్లను మించిన ఆధునిక రూపం సంతరించుకుంటుందని అన్నారు.
రాయనపాడు రైల్వే స్టేషన్ త్వరలోనే అమృత్ భారత్ స్టేషన్గా ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుందని వెల్లడించారు. గుణదల రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ కింద ప్రారంభం అవుతుందని తెలిపారు. కొండపల్లి రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ 2.0 (సెకండ్ ఫేజ్) కింద అప్లై చేసి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ లో రెండు ప్లాట్ఫామ్ల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు.