సెంచరీ కొట్టి జట్టును గెలిపించడం చాలా ఆనందంగా ఉంది!: లంక హీరో నిస్సంక

  • ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడిన నిస్సంక
  • లంకకు సూపర్-8 బెర్తు ఖాయం
  • పల్లెకెలెలో రికార్డు రన్ ఛేజ్
“పిచ్ బ్యాటింగ్‌కు చాలా సహకరించింది.. నా సహజసిద్ధమైన ఆట తీరును ప్రదర్శించే అవకాశం దక్కింది. సెంచరీ సాధించి, జట్టును సూపర్-8కు చేర్చడం మనసుకి ఎంతో తృప్తినిస్తోంది” అని శ్రీలంక ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిస్సంక తన సంతోషాన్ని పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై లంక సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత మీడియాతో మాట్లాడాడు.

182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే కుశాల్ పెరీరా వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, నిస్సంక మాత్రం ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ఆస్ట్రేలియా పేసర్లను దీటుగా ఎదుర్కొన్నాడు.

“మ్యాచులో పవర్‌ప్లే చాలా కీలకం. కుశాల్ మెండిస్, నేను కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఆ తర్వాత కేవలం నా జోన్‌లోకి వచ్చే బంతుల కోసం ఎదురుచూశాను” అని నిస్సంక వివరించాడు. స్టోయినిస్ వేసిన 15వ ఓవర్‌లో నిస్సంక ఏకంగా 20 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు.

ఈ అజేయ సెంచరీతో (100* - 52 బంతుల్లో) నిస్సంక పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన రెండో శ్రీలంక ఓపెనర్‌గా (గతంలో మహేల జయవర్ధనే ఈ ఘనత సాధించాడు) రికార్డులకెక్కాడు. అలాగే, ప్రపంచకప్‌లో 6 సార్లు 50+ స్కోర్లు చేసిన మూడో లంక బ్యాటర్‌గా తిలకరత్న దిల్షాన్ సరసన చేరాడు.

ఈ గెలుపుతో శ్రీలంక సూపర్-8 దశకు చేరుకోగా, ఆస్ట్రేలియా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లంక బౌలర్ దుషన్ హేమంత (3/37) స్పెల్ ఆసీస్ పతనాన్ని శాసించింది. గ్రూప్-బి లో లంక టాప్ పొజిషన్‌లో ఉండగా, ఆసీస్ తదుపరి మ్యాచుల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


More Telugu News