Droupadi Murmu: సాగర తీరంలో నౌకాదళ విన్యాసాలు... రేపు విశాఖకు రాష్ట్రపతి ముర్ము

Droupadi Murmu to Review Naval Exercises in Visakhapatnam
  • విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ.. హాజరుకానున్న రాష్ట్రపతి ముర్ము
  • 70కి పైగా యుద్ధనౌకల ఫ్లీట్‌ను సమీక్షించనున్న సర్వ సైన్యాధ్యక్షురాలు
  • ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక ఈసారి ప్రత్యేక ఆకర్షణ
  • ఐఎఫ్ఆర్‌తో పాటు మిలాన్, హిందూ మహాసముద్ర సింపోజియం కూడా
  • మూడు ప్రధాన నౌకాదళ ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం విశాఖపట్నం రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయుధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలి హోదాలో రాష్ట్రపతి ఈ విన్యాసాలను సమీక్షిస్తారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రతినిధులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు ఒకచోటకి చేరి తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడమే ఐఎఫ్ఆర్ ముఖ్య ఉద్దేశం.

మంగళవారం రాష్ట్రపతి గౌరవార్థం ఇచ్చే విందుతో ఐఎఫ్ఆర్-2026 కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన యాంకరేజ్ ప్రాంతంలో భారత్‌తో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన సుమారు 70 యుద్ధనౌకల ఫ్లీట్‌ను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటారు. దేశాల మధ్య సముద్రయాన శక్తిని, సహకారాన్ని, స్నేహాన్ని ప్రదర్శించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని భారత నౌకాదళం వివరించింది.

ఈసారి ఐఎఫ్ఆర్‌లో 'ఆపరేషన్ సిందూర్' హీరో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్ నౌకాదళాన్ని కట్టడి చేయడంలో ఈ యుద్ధనౌక వ్యూహాత్మకంగా కీలకపాత్ర పోషించింది. మిత్ర దేశాల నౌకాదళాలు ఈ విమాన వాహక నౌకను సమీపం నుంచి పరిశీలించనున్నాయి.

ఈసారి విశాఖ కేవలం ఐఎఫ్ఆర్‌కే కాకుండా మరో రెండు కీలక కార్యక్రమాలకు కూడా వేదికైంది. భారత నౌకాదళం ఆధ్వర్యంలో 13వ ఎడిషన్ మిలాన్-2026, హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం సదస్సు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. 135కి పైగా దేశాలను మిలాన్ విన్యాసాలకు ఆహ్వానించారు. భారత్ ఈ మూడు ప్రధాన సముద్రయాన కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించడం ఇదే ప్రప్రథమం.

భారత్‌లో తొలి ఐఎఫ్ఆర్‌ను 2001లో ముంబైలో నిర్వహించగా, అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ సమీక్షించారు. రెండోసారి 2016లో విశాఖపట్నంలో నిర్వహించగా, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇప్పుడు మూడోసారి జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా భారత నౌకాదళ శక్తి, అంతర్జాతీయ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.
Droupadi Murmu
Indian Navy
International Fleet Review
IFR 2026
Visakhapatnam
Andhra Pradesh
Naval Exercises
Milan 2026
INS Vikrant
Operation Sindoor

More Telugu News