అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

  • సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించిన కేసు
  • అంబటికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరిన న్యాయవాది పొన్నవోలు
  • పూర్తి స్థాయి విచారణ కోసం కస్టడీ అవసరమన్న పోలీసుల తరపు న్యాయవాది

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు పోలీస్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును 18వ తేదీకి రిజర్వ్ చేసింది.


ఈ కేసు 2023 సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారానికి సంబంధించినది. అంబటి రాంబాబు తరఫున పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. తీవ్ర నేరాలు, జీవితఖైదు శిక్షలు పడే కేసుల్లోనే బెయిల్ నిరాకరించాలని ఈ సందర్భంగా పొన్నవోలు అన్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ అవసరం లేదని చెప్పారు. ఈ కేసులో రెండేళ్లలోపు శిక్ష విధించే సెక్షన్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి కస్టడీ అవసరం లేదని... బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.


పోలీసుల తరఫున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... అంబటి రాంబాబు లాటరీ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని... పూర్తి స్థాయి విచారణ కోసం పోలీస్ కస్టడీ అవసరమని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్, పోలీస్ కస్టడీ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేశారు. ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.



More Telugu News