నల్గొండను దేశం గర్వించేలా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: కోమటిరెడ్డి

  • నల్గొండ మేయర్, డిప్యూటీ మేయర్లకు కోమటిరెడ్డి అభినందనలు
  • తన మనసు గర్వంతో నిండిపోయిందని వ్యాఖ్య
  • ఓడిపోయిన డివిజన్లలో కూడా అభివృద్ధిని కొనసాగిస్తామన్న మంత్రి

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లను ఈరోజు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు తన జీవిత కల అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. నూతన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. 


నల్గొండ తన జన్మభూమి అని కోమటిరెడ్డి అన్నారు. నల్గొండలోని ప్రతి గల్లీ తన గుండెచప్పుడు అని చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారం చేస్తుంటే... తన మనసు ఎంతో గర్వంతో నిండిపోయిందని అన్నారు. నల్గొండను దేశం గర్వించేలా క్లీన్ అండ్ గ్రీన్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. 


“రాజకీయాలకు తావు లేకుండా, మేము ఓడిపోయిన డివిజన్లలో కూడా అభివృద్ధిని కొనసాగిస్తాం. ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమం, ప్రతి వీధికి ఆధునిక వసతులు చేరేలా చూడడమే నా బాధ్యత” అని మంత్రి ప్రకటించారు. “నాటి ఫ్లోరోసిస్ వ్యతిరేక పోరాటం నుంచి నేటి స్మార్ట్ సిటీ నిర్మాణం వరకు... మీ కోమటిరెడ్డి ఎప్పుడూ మీ తోడుగానే ఉంటాడు. మనందరం కలిసి నవ నల్గొండను నిర్మిద్దాం” అని పిలుపునిచ్చారు.





More Telugu News