Bill Gates: రేపు ఏపీలో బిల్ గేట్స్ పర్యటన

Bill Gates to Visit Andhra Pradesh Tomorrow
  • సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌తో కీలక అంశాలపై గేట్స్ చర్చలు
  • విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై ప్రధానంగా దృష్టి
  • ఆర్‌టీజీఎస్ కేంద్రం, ఉండవల్లి పొలాలను సందర్శించనున్న బిల్ గేట్స్
  • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టును విస్తరించనున్న ప్రభుత్వం
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి ఏపీకి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లతో సమావేశమవుతారు.

ఆదివారం అందిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్) కేంద్రాన్ని సందర్శించి, పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారులతో బిల్ గేట్స్ బృందం సమావేశమవుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే అమలవుతున్న ప్రాజెక్టులను మరింతగా విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు.

‘స్వర్ణాంధ్ర విజన్-2047’ లక్ష్యాల సాధనకు చేపట్టిన సంస్కరణలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, మెడ్‌టెక్, సంజీవని వంటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్‌కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టు పనితీరును ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకంగా వివరించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సమావేశాల అనంతరం, బిల్ గేట్స్ బృందం అమరావతిలోని ఉండవల్లి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుంది. అక్కడ డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహాయంతో చేపడుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిశీలించనుంది.


Bill Gates
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Microsoft
Gates Foundation
Agriculture
Healthcare
Real Time Governance

More Telugu News