భారీ గెలుపు తర్వాత భారత్‌పై తారిక్ రెహమాన్ తొలి స్పందన

  • బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ఘన విజయం
  • భారత్‌తో సంబంధాల్లో మా దేశ ప్రయోజనాలే ప్రామాణికం అన్న రెహమాన్
  • ఫలితాలు రాకముందే తారిక్ రెహమాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
  • అన్ని దేశాలతో సమతుల్య సంబంధాలు కోరుకుంటున్నామన్న రెహమాన్ సలహాదారు
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధినేత, కాబోయే ప్రధాని తారిక్ రెహమాన్ భారత్‌తో భవిష్యత్ సంబంధాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. "బంగ్లాదేశ్, దాని ప్రజల ప్రయోజనాలే మా విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తాయి" అని ఆయన అన్నారు. 'బంగ్లాదేశ్ ఫస్ట్' నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన, శనివారం తన తొలి ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 297 స్థానాలకు గాను బీఎన్‌పీ 212 సీట్లు గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది. షేక్ హసీనా ప్రభుత్వం విద్యార్థి ఉద్యమంతో కూలిపోయిన తర్వాత దేశంలో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. రాడికల్ జమాత్-ఎ-ఇస్లామీ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత దేశానికి తిరిగొచ్చిన కొద్ది వారాల్లోనే తారిక్ రెహమాన్ తన పార్టీని విజయతీరాలకు చేర్చారు.

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో భారత్ కూడా వేగంగా స్పందించింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే ప్రధాని నరేంద్ర మోదీ, తారిక్ రెహమాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతు కొనసాగుతుందని, ఇరు దేశాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని మోదీ ఆకాంక్షించారు.

‘ఇండియా టుడే’కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ సలహాదారు హుమాయున్ కబీర్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. "మేము అన్ని దేశాలతో సమతుల్య సంబంధాలను కోరుకుంటున్నాము. మా సంబంధాలను ఒక్క దేశానికే పరిమితం చేయబోము" అని ఆయన స్పష్టం చేశారు. రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది.


More Telugu News