జగన్ ఒక 'మర్చంట్ ఆఫ్ డెత్'... సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • వైసీపీ అధినేత జగన్‌ను 'మర్చంట్ ఆఫ్ డెత్' అంటూ అభివర్ణించిన సోమిరెడ్డి
  • జగన్‌కు విధ్వంసం, శవ రాజకీయాలంటే ఇష్టమని తీవ్ర ఆరోపణ
  • ర్యాలీల్లో చనిపోయిన కార్యకర్తలను కూడా పరామర్శించరని విమర్శ
  • తల్లిదండ్రులను దూషించే వారిని శిక్షించేలా ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను 'మర్చంట్ ఆఫ్ డెత్' (మృత్యు వ్యాపారి) అని అభివర్ణించారు. జగన్‌కు విధ్వంసం, శవ రాజకీయాలు అంటే ఎంతో ఇష్టమని సోమిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. "డిక్కీలో శవాన్ని వేసుకుని వచ్చిన తన ఎమ్మెల్సీ భుజాన్ని తట్టే నైజం జగన్‌ది. తన ర్యాలీలోనే కార్యకర్తలు చనిపోతే కనీసం పరామర్శకు వెళ్లరు. కానీ, బూతులు తిట్టిన వారిని మాత్రం పరామర్శిస్తారు. ర్యాలీలు చేపట్టి ఒకరిద్దరు చనిపోయేలా చేస్తారు. అందుకే జగన్‌ను 'మర్చంట్ ఆఫ్ డెత్' అంటాను" అని తీవ్రంగా విమర్శించారు. కేవలం శవ రాజకీయాలు చేసేందుకే జగన్ తన పార్టీని స్థాపించారని ఆయన ఆరోపించారు.

రాజకీయ ప్రత్యర్థుల తల్లిదండ్రులను దూషించిన వారిని జగన్ కనీసం కట్టడి చేయరని సోమిరెడ్డి మండిపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్నారు. నేతల తల్లిదండ్రులను దూషించే వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా రాష్ట్రంలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


More Telugu News