కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

  • కేంద్ర బడ్జెట్ 2026-27 కేటాయింపులపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • కేంద్ర పథకాలతో అదనపు నిధులు సాధించాలని అధికారులకు ఆదేశం
  • ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ కారిడార్, పల్నాడు టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సూచన
  • గత ప్రభుత్వ వైఫల్యంతో నిధుల వినియోగంలో సమస్యలు తలెత్తాయని వ్యాఖ్య
  • అమరావతిలో సెమీకండక్టర్, హెల్త్ సిటీ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని నిర్దేశం
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు.

కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయగలిగితేనే, అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు ఖర్చు చేయకపోవడంతో పథకాలు నిర్వీర్యమయ్యాయని, యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలోనూ సమస్యలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్కు, తిరుపతిలో స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్, హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్‌ను ప్రతిపాదించాలని సూచించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కింద అమరావతిలో సెమీ కండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు చేపట్టాలని, రాజధానిలోని హెల్త్ సిటీలో 'హీల్ ఇన్ ఏపీ' విధానంలో మెడికల్ టూరిజం ప్రాజెక్టులను ప్రోత్సహించాలని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని, మరిన్ని బస్సులను సాధించాలని ఆదేశించారు.


More Telugu News