Mohibuzzaman Kochi: బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. ఘర్షణలో బీఎన్‌పీ నేత మృతి

Bangladesh Election Violence BNP Leader Mohibuzzaman Kochi Dead
  • బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు
  • ఖుల్నాలో జరిగిన ఘర్షణలో బీఎన్‌పీ నేత మృతి
  • గోపాల్‌గంజ్‌లో పోలింగ్ కేంద్రంపై బాంబు దాడి.. ముగ్గురికి గాయాలు
  • తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని జమాత్ ఆరోపణ
బంగ్లాదేశ్‌లో గురువారం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఖుల్నా జిల్లాలో జరిగిన ఘర్షణలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత మొహిబుజ్జమాన్ కోచీ మరణించారు. ఈ ఘటనలతో దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఖుల్నాలోని అలియా మదరసా పోలింగ్ కేంద్రం వద్ద బీఎన్‌పీ, జమాత్-ఏ-ఇస్లామీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. జమాత్ తరపున ప్రచారం చేస్తున్న మదరసా ప్రిన్సిపాల్‌ను మొహిబుజ్జమాన్ కోచీ అడ్డుకునే ప్రయత్నంలో ఈ మరణం సంభవించింది. మదరసా ప్రిన్సిపాల్‌.. కోచీని తోసేశారని, దీంతో కోచీ ఒక చెట్టుకు తల తగిలి మరణించారని బీఎన్‌పీ నేత ఒకరు ఆరోపించారు. ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారు. కోచీని ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా, గోపాల్‌గంజ్ సదర్ ఉపజిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాక్‌టెయిల్ బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఇద్దరు అన్సార్ సిబ్బంది, ఓటరుతో పాటు వచ్చిన ఒక చిన్నారితో సహా ముగ్గురు గాయపడ్డారు. కేంద్రం బయట ఉన్న కాలువ అవతలి వైపు నుంచి దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, దేశంలోని పలు ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు జరుగుతున్నాయని, ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని జమాత్-ఏ-ఇస్లామీ ఆరోపించింది. ఈ విషయమై ఎన్నికల సంఘానికి, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ సహాయ ప్రధాన కార్యదర్శి మీడియాకు తెలిపారు. పెరుగుతున్న రాజకీయ ఘర్షణలు, హింస నడుమ జరుగుతున్న ఈ ఎన్నికల నిష్పాక్షికతపై పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Mohibuzzaman Kochi
Bangladesh Election
Bangladesh Nationalist Party
BNP Leader Death
Khulna Violence
Jamaat-e-Islami
Cocktail Bomb Attack
Gopalganj
Political Clash
Bangladesh Politics

More Telugu News