అవి నా మాటలు కావు... ఏఐ ఉపయోగించారు: బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా

  • రాజీవ్ శుక్లా ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • ఎక్స్ వేదికగా స్పందించిన రాజీవ్ శుక్లా
  • తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ
టీ20 వరల్డ్ కప్ 2028లో భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని తొలుత ప్రకటించిన పాకిస్థాన్, ఐసీసీ జోక్యంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడతామని పాక్ ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన పరిష్కారంతో సంతృప్తి చెందినట్లు, ఇతర దేశాల విజ్ఞప్తిని గౌరవిస్తూ భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. 

అయితే పాక్ మీడియాలో దీనికి భిన్నంగా ప్రచారం సాగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ చానల్‌లో ప్రసారమైన క్రికెట్ షోలో మాజీ ఆటగాడు షోయబ్ మాలిక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ కార్యక్రమంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాక్‌తో మ్యాచ్ విషయంలో మాట్లాడినట్లు చూపించిన ఓ వీడియోను ప్రసారం చేశారు. భారత్‌తో ఆడేందుకు పాకిస్థాన్‌ను ఒప్పించాలని ఐసీసీపై బీసీసీఐ ఒత్తిడి తెచ్చిందని శుక్లా అన్నట్లు ఆ వీడియోలో ప్రసారం జరిగింది.  

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజీవ్ శుక్లా స్పందించారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఏఐ సాయంతో తన వాయిస్‌ను మార్చి తప్పుడు ఆడియో రూపొందించారని తెలిపారు. ఇలాంటి తప్పుదారి పట్టించే కంటెంట్‌ను నమ్మవద్దని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇటువంటి వీడియోలు కనిపిస్తే రిపోర్ట్  కొట్టాలని రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా సూచించారు. 


More Telugu News