ఇండియాతో మ్యాచ్ కు ఒప్పుకున్న పాకిస్థాన్... హర్భజన్ సింగ్ కామెంట్స్
- పాకిస్థాన్ది రోజుకో మాట, గంటకొక స్టేట్మెంట్ అన్న హర్భజన్
- ఇంత ఓవరాక్షన్ ఎందుకని ఎద్దేవా
- భారత్పై ఆధారపడకుండా పాకిస్థాన్ క్రికెట్ నిలవడం కష్టమని వ్యాఖ్య
టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభం కాకముందు నుంచే క్రికెట్ అభిమానుల దృష్టి ఒక్క మ్యాచ్పైనే నిలిచింది. అది భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్. రాజకీయ ఉద్రిక్తతలు, బోర్డు స్థాయి ప్రకటనలు, పరస్పర ఆరోపణలు... ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఈ హై-వోల్టేజ్ పోరు ఎట్టకేలకు (ఫిబ్రవరి 15న) జరగనుంది.
మొదట్లో భారత జట్టుతో మ్యాచ్ బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గట్టిగా హెచ్చరికలు జారీ చేయడంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారమే భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది.
పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. “రోజుకో మాట, గంటకొక స్టేట్మెంట్ ఇలా ఓవరాక్షన్ ఎందుకు?” అంటూ ప్రశ్నించాడు. బహిష్కరణ అంటూ మొదట బిల్డప్ ఇచ్చి, ఇప్పుడు మళ్లీ ఒప్పుకోవడం ఏమిటని నిలదీశాడు.
భారత్తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్కే ఎక్కువ నష్టమని, ఆ విషయం పీసీబీకి కూడా బాగా తెలుసని హర్భజన్ వ్యాఖ్యానించాడు. “భారత్పై ఆధారపడకుండా పాకిస్థాన్ క్రికెట్ నిలవడం కష్టం. కానీ భారత్ మాత్రం ఎప్పుడూ పాకిస్థాన్పై ఆధారపడదు” అంటూ వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి 15న జరగనున్న మ్యాచ్పైనే ఉంది. ప్రస్తుతం భారత జట్టు మంచి ఫామ్లో ఉండగా, పాకిస్థాన్పై ఒత్తిడి ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హర్భజన్ సింగ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, “ఇండియా ఉన్న ఫామ్ చూస్తే పాకిస్థాన్కు గట్టి పరీక్షే” అని అన్నాడు.